తిరుపతిలో 40 నిమిషాల పాటు ఇండిగో విమానం చక్కర్లు

  • తిరుపతి – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం
  • ఫ్లైట్ లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ 
  • సర్వీస్ రద్దు చేసినట్లు ప్రకటించిన ఇండిగో
తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరిగి మళ్లీ తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో పైలట్ గాల్లో చక్కర్లు కొట్టించాడు. అయితే, విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విమానంలో సాంకేతిక లోపం గుర్తించడంతో సర్వీస్‌ను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. అయితే ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఇండిగో పేర్కొంది. సర్వీస్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


More Telugu News