Vishal Kumar Gokavi: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... అతడికి తెలియకుండానే మత మార్పిడి చేశారు!

కర్ణాటకలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత తన భార్య తనను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిందని ఆరోపిస్తూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, విశాల్ కుమార్ గోకావి అనే వ్యక్తి తన భార్య తహసీన్ హొసమణిపై మత మార్పిడి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టాడు.

విశాల్, తహసీన్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. వారిద్దరూ 2024 నవంబర్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత తహసీన్, విశాల్‌ను ముస్లిం సంప్రదాయాల ప్రకారం మరోసారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. భార్య కోరిక మేరకు విశాల్ ఈ ప్రతిపాదనకు అంగీకరించాడు. దీంతో, ఏప్రిల్ 25న వారికి ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది.

అయితే, ఈ వివాహ వేడుక సమయంలోనే తనకు తెలియకుండానే 'మౌల్వి' ద్వారా తన పేరు మార్చేశారని, తనను ఇస్లాంలోకి మత మార్పిడి చేశారని గోకావి ఆరోపించాడు. తనను మోసం చేసి మతం మార్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతేకాకుండా, విశాల్ కుటుంబం జూన్ 5న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకకు సిద్ధమవుతుండగా, మొదట అంగీకరించిన తహసీన్, ఆమె కుటుంబ సూచనలతో వెనక్కి తగ్గిందని గోకావి తెలిపాడు. అంతేగాకుండా, తాను ఇస్లాంలోకి మారకపోతే తనపై అత్యాచార కేసు పెడతానని తహసీన్ బెదిరించిందని కూడా విశాల్ వాపోయాడు. తహసీన్, ఆమె తల్లి బేగం బాను తనను నమాజ్ చేయమని, జమాత్‌కు హాజరు కావాలని బలవంతం చేశారని కూడా గోకావి పేర్కొన్నాడు.

ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 299 మరియు 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలో బలవంతపు మత మార్పిడులపై జరుగుతున్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. న్యాయం జరగాలని విశాల్ కుమార్ గోకావి కోరుతున్నాడు. 
Vishal Kumar Gokavi
Karnataka
forced conversion
religious conversion
marriage
Tahsina Hosamani
Islam
Hindu
crime
police investigation

More Telugu News