చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

  • మూడు ఫార్మాట్లలో 900కి పైగా ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ
  • అత‌నికి టెస్టుల్లో 937, వ‌న్డేల్లో 909, టీ20ల్లో 909 రేటింగ్ పాయింట్స్
  • తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేసిన ఐసీసీ  
  • దాంతో 897 నుంచి 909కి పెరిగిన విరాట్ రేటింగ్ పాయింట్స్
టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో 900 కంటే ఎక్కువ ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా ర‌న్‌మెషీన్ నిలిచాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేయ‌డంతో కోహ్లీ టీ20 రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. అత‌నికి టెస్టుల్లో 937, వ‌న్డేల్లో 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.   

ఇక‌, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ వరుసగా 1202 రోజులు అగ్రస్థానంలో నిలిచాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ సాధించని రికార్డు ఇది. 2018లో అత్యధిక పరుగులతో కోహ్లీ ఒకేసారి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నంబర్ వ‌న్‌ ఐసీసీ ర్యాంక్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంత‌కుముందు ఈ ఘనతను ఆసీస్ స్టార్ క్రికెట‌ర్‌ రికీ పాంటింగ్ మాత్రమే సాధించాడు. 

మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1 ర్యాంక్‌ను విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే పొందారు. కానీ, ఒకేసారి అన్ని ఫార్మాట్ల‌లో నం.01గా నిలిచింది కోహ్లీ, పాంటింగ్ మాత్రమే. కాగా, కోహ్లీ టీ20తో పాటు టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికి వ‌న్డేల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. 


More Telugu News