ఇది వాయనాడ్ గర్వించే విషయం: ప్రియాంక గాంధీ
- వాయనాడ్ కాఫీకి విశిష్ట గుర్తింపు
- కేంద్ర ప్రభుత్వ ఓడీఓపీ కార్యక్రమంలో వ్యవసాయ విభాగంలో గుర్తింపు
- హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
- వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంక
వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, కేరళలోని వాయనాడ్ జిల్లాకు చెందిన జిఐ-ట్యాగ్ రోబస్టా కాఫీకి కేంద్ర ప్రభుత్వ ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్-ఓడీఓపీ) కార్యక్రమంలో వ్యవసాయ విభాగంలో గుర్తింపు లభించినట్లు ఎక్స్లో ప్రకటించారు. కేరళలో ఈ గౌరవం పొందిన మొదటి ఉత్పత్తిగా వాయనాడ్ కాఫీ నిలిచిందని తెలిపారు. ఈ గుర్తింపు వయనాడు రైతుల కష్టానికి, నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి నిదర్శనమని ఆమె వివరించారు. ఇది వాయనాడ్ గర్వించే విషయని సంతోషం వ్యక్తం చేశారు.
ఓడీఓపీ కార్యక్రమం ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి, బ్రాండ్గా ప్రమోట్ చేస్తూ స్థానిక ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేస్తుంది. వాయనాడ్ కాఫీ, తన ప్రత్యేక రుచి, నాణ్యతతో జిఐ ట్యాగ్ను కలిగి ఉంది. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సాంప్రదాయ సాగు పద్ధతులు దీని విజయానికి కారణం. నెదర్లాండ్స్కు ఎగుమతి చేసిన శాంపిల్స్ 88, 86 కప్ స్కోర్లతో స్పెషాలిటీ కాఫీగా గుర్తింపు పొందాయి.
కేరళ ప్రభుత్వ ‘క్లైమేట్ స్మార్ట్ కాఫీ ప్రాజెక్ట్’ దీనికి తోడ్పాటునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ‘వాయనాడన్ రోబస్టా’ బ్రాండ్ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న రైతులకు శిక్షణ, నాణ్యత మెరుగుదలపై అవగాహన కల్పిస్తోంది. వాయనాడ్ లో 80 శాతం చిన్న-స్థాయి రైతులు ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఈ ఒడీఓపీ గుర్తింపు వాయనాడ్ రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ఒక మైలురాయి. ‘వాయనాడ్ కాఫీ పార్క్’ ప్రాజెక్ట్ చిన్న, గిరిజన, మహిళా రైతులకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తోంది. ఈ విజయం వాయనాడ్ కాఫీని గ్లోబల్ స్పెషాలిటీ మార్కెట్లో స్థాపించడంతో పాటు, పర్యావరణ స్థిరత్వాన్ని, జీవవైవిధ్య సంరక్షణను ప్రోత్సహిస్తుంది.