లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే ఆధార్ కార్డులు

  • 14 ఏళ్లలో 11.7 కోట్ల మంది మృతి
  • అయినప్పటికీ 1.15 కోట్ల ఆధార్ కార్డులు మాత్రమే డీయాక్టివేషన్
  • ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సమాచారం
దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది.

ఈ గణనీయమైన అసమానత ఆధార్ డేటా విశ్వసనీయత, అప్‌గ్రేడ్‌పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. సంయుక్త రాష్ట్రాల జనాభా నిధి (యూఎన్ఎఫ్‌పీఏ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి భారత జనాభా 146.39 కోట్లకు చేరుకుంది. అయితే ఆధార్ కార్డుదారుల సంఖ్య 142.39 కోట్లుగా ఉంది. అయితే,  సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ప్రకారం.. 2007 నుంచి 2019 వరకు సంవత్సరానికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన గత 14 సంవత్సరాల్లో 11.69 కోట్లకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ యూఐడీఏఐ కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేసింది.

గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరం వారీగా ఎన్ని ఆధార్ నంబర్లు మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేయబడ్డాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు "అటువంటి సమాచారం మా వద్ద లేదు" అని యూఐడీఏఐ సమాధానమిచ్చింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడ్డాయని మాత్రమే యూఐడీఏఐ తెలిపింది. ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్, డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


More Telugu News