నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య.. అక్రమ సంబంధమే కారణం!

  • రెండు రోజులుగా అదృశ్యం.. సింగోటం రిజర్వాయర్ లో మృతదేహం
  • కల్వకోల్ గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మహిళ భర్త, కొడుకు దాడి
నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన సదరు నేత.. చివరకు ఓ రిజర్వాయర్ లో శవమై తేలాడు. జిల్లాలోని కల్వకోల్ గ్రామంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. కల్వకోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్నాటి దామోదర్ గౌడ్ (48) కనిపించకుండా పోయారు. రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో దామోదర్ గౌడ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సింగోటం రిజర్వాయర్ లో మృతదేహం లభించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దామోదర్ గౌడ్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సదరు మహిళతో గడిపేందుకు వెళ్లాడు. దామోదర్ గౌడ్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా.. సదరు మహిళ భర్త, కొడుకు గమనించారు. ఆగ్రహం పట్టలేక ఇద్దరిపైనా దాడి చేసి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కెనాల్ లో పడేశారు. రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ మృతదేహం సింగోటం రిజర్వాయర్ లో తేలింది. ప్రస్తుతం ఆ మహిళను, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Congress Leader Murder
Karnati Damodar Goud
Nagarkurnool
Extra Marital Affair
Kalwakole
Singotam Reservoir
Telangana Crime
MGKL Canal

More Telugu News