పీహెచ్‌డీలను మించిన మేధస్సు!... 'గ్రోక్-4' వచ్చేసింది.!

  • ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐ నుంచి కొత్త చాట్‌బాట్ 'గ్రోక్ 4' విడుదల
  • గతంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న గ్రోక్
  • కొత్త వెర్షన్‌కు పీహెచ్‌డీ స్థాయి మేధస్సు ఉందని చెబుతున్న మస్క్
  • భవిష్యత్తులో కొత్త టెక్నాలజీలు, ఫిజిక్స్ కూడా కనుగొంటుందని ధీమా
  • ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు 300 డాలర్ల భారీ ధర
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI), తన సరికొత్త ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్ 4'ను విడుదల చేసింది. అయితే, దీని పాత వెర్షన్ చేసిన జాత్యహంకార, యూదు వ్యతిరేక వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారకముందే ఈ కొత్త వెర్షన్‌ను తీసుకురావడం, దీనిపై మస్క్ భారీ అంచనాలు ప్రకటించడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎక్స్ వేదికగా జరిగిన ఒక లైవ్‌స్ట్రీమ్‌లో మస్క్, తన ఎక్స్ఏఐ బృందంతో కలిసి ఈ కొత్త చాట్‌బాట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గ్రోక్ 4కు పీహెచ్‌డీ స్థాయి కంటే ఎక్కువ మేధస్సు ఉంది. కొన్నిసార్లు సాధారణ విషయాలను గ్రహించడంలో విఫలమైనా, అకడమిక్ అంశాల్లో దీని అవగాహన అమోఘం... పీహెచ్‌డీ స్థాయి వ్యక్తులు విఫలమైన అంశాల్లో గ్రోక్-4 రాణిస్తుంది" అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఇది కొత్త టెక్నాలజీలను, రాబోయే రెండేళ్లలో కొత్త భౌతిక శాస్త్రాన్ని కూడా కనుగొనగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో గ్రోక్ చాట్‌బాట్, నియంత హిట్లర్‌ను పొగడటంతో పాటు, యూదులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక యూదు ఇంటిపేరు ఉన్న వ్యక్తిని ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం, తనను తాను 'మెకాహిట్లర్' అని అభివర్ణించుకోవడం వంటి పోస్టులు దుమారం రేపాయి. ఈ వివాదాల కారణంగా పాత పోస్టులను తొలగించిన కొద్ది రోజులకే ఇప్పుడు కొత్త వెర్షన్‌ను విడుదల చేయడం గమనార్హం.

ఈ కొత్త 'గ్రోక్ 4' చాట్‌బాట్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం సేవగా అందుబాటులో ఉంటుంది. దీని అత్యాధునిక ఫీచర్లను పొందాలంటే నెలకు 300 డాలర్లు (సుమారు రూ. 25,000) చెల్లించి 'ప్రో' సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లిష్టమైన అంశాలను సైతం ఇది విశ్లేషించగలదని, సోర్స్ కోడ్‌ను కాపీ పేస్ట్ చేస్తే అందులోని తప్పులను కూడా సరిదిద్దగలదని మస్క్ తెలిపారు.


More Telugu News