Vatsala: వందేళ్ల ప్రయాణం ముగిసింది.. 'దాదీ మా' వత్సల కన్నుమూత

Vatsala the Oldest Elephant Dies at Panna Tiger Reserve
షార్ట్స్‌లో చూడండి
పన్నా టైగర్ రిజర్వ్ (పీటీఆర్)కు గర్వకారణంగా, అటవీ సిబ్బందికి, పర్యాటకులకు 'దాదీ మా'గా ప్రేమను పంచిన వత్సల అనే ఏనుగు తన శతాధిక సంవత్సరాల జీవన ప్రస్థానాన్ని ముగించింది. ఆసియాలోనే అత్యంత వృద్ధ ఆడ ఏనుగుగా గుర్తింపు పొందిన వత్సల, వయోభారంతో పాటు పలు అవయవాలు విఫలం కావడంతో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆమె మరణంతో పన్నా అభయారణ్యంలో ఒక శకం ముగిసినట్లయింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వత్సల, హినౌతా క్యాంపులో పశువైద్యుల పర్యవేక్షణలో ఉంది. వత్సల మరణవార్త తెలియగానే పీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచితా టిర్కీ, డిప్యూటీ డైరెక్టర్ మోహిత్ సూద్, వన్యప్రాణి వైద్యులు సంజీవ్ గుప్తా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్యాంపులోనే గౌరవప్రదంగా వత్సల అంత్యక్రియలు నిర్వహించారు.

కేరళ నుంచి పన్నా వరకు సాగిన ప్రస్థానం
వత్సల ప్రస్థానం కేరళలోని నీలంబూర్ అడవుల్లో ప్రారంభమైంది. అక్కడ కలప రవాణా పనులకు ఉపయోగపడిన వత్సలను, 1971లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు తీసుకొచ్చారు. సుమారు దశాబ్ద కాలం పాటు పులుల జాడను గుర్తించే బృందంలో కీలక పాత్ర పోషించి, వన్యప్రాణి సంరక్షణకు ఎంతగానో దోహదపడింది. తన చివరి రోజుల వరకు ఇతర ఏనుగు పిల్లలకు సంరక్షకురాలిగా, కొన్ని ఏనుగుల ప్రసవాలకు మంత్రసానిగా వ్యవహరించి తల్లి ప్రేమకు నిలువుటద్దంగా నిలిచింది.

వత్సల మృతి పట్ల పన్నా ఎంపీ బ్రీజేంద్ర ప్రతాప్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "వందేళ్లకు పైగా అద్భుతమైన ప్రయాణం చేసిన వత్సల మరణం పన్నా ప్రజలకు భావోద్వేగపూరితమైన క్షణం" అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. పన్నాను సందర్శించిన పర్యాటకులు సైతం వత్సలతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
Go Back to Shorts
Vatsala
Panna Tiger Reserve
oldest elephant
elephant death
Madhya Pradesh
wildlife conservation
Kerala
Hoshangabad
Brijendra Pratap Singh
Dadi Maa

More Telugu News