Chandrababu Naidu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... మరింత క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.

శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ను దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచితే, తాము ఒకేసారి ఆ మొత్తాన్ని పెంచామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక పెద్ద వరమని, రాయలసీమ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందని చంద్రబాబు అన్నారు. గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే రాయలసీమలో కరువు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Free Bus Travel
Women Free Bus
AP Elections 2024
Super Six Promises
Srisailam
Polavaram Project
Rayalaseema Development

More Telugu News