భారత్ చారిత్రక విజయం.. సచిన్, కోహ్లీ, యువరాజ్ ప్రశంసలు

  • ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో భారత్ 336 పరుగుల ఘన విజయం
  • ఎడ్జ్‌బాస్టన్ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి టెస్టు గెలుపు
  • సిరీస్‌ను 1-1తో సమం చేసిన గిల్ సేన
  • భారత జట్టుపై సచిన్, కోహ్లీ, యువరాజ్ వంటి దిగ్గజాల ప్రశంసల జ‌ల్లు
ఇంగ్లండ్ గడ్డపై యువ భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో, యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో చారిత్రక ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేయడమే కాకుండా, ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి టెస్టు గెలిచి చరిత్ర సృష్టించింది.

భారత జట్టు ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను అద్భుతమని అభివర్ణించిన సచిన్ టెండూల్కర్, సిరీస్‌ను సమం చేసేందుకు భారత్ అనుసరించిన వ్యూహం అమోఘమని అన్నాడు. బౌలర్ల ప్రదర్శన, ముఖ్యంగా జో రూట్‌కు ఆకాశ్ దీప్ వేసిన బంతి 'బాల్ ఆఫ్ ది సిరీస్' అని కొనియాడాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భారత జట్టు నిర్భయంగా ఆడిందని, గిల్ కెప్టెన్సీతో పాటు సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.

భారత్ సాధించిన ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఆకాశ్ దీప్ నిర్భయంగా బౌలింగ్ చేశాడని, గిల్ ఎంతో పరిణతి కనబరిచాడని ప్ర‌శంసించాడు. ఐసీసీ ఛైర్మన్ జై షా, వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టు పోరాట స్ఫూర్తిని, గిల్ నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ విజయంతో సిరీస్ సమం కావడంతో జులై 10 నుంచి లార్డ్స్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టుపై ఆసక్తి నెలకొంది.

Team India
India vs England
Shubman Gill
India cricket
Sachin Tendulkar
Virat Kohli
Akash Deep
Edgbaston Test
Test series
Cricket
Indian cricket team

More Telugu News