పుణేలో 'ఆపరేషన్ సిందూర్‌'ను గుర్తుచేసిన కేంద్ర హోంమంత్రి

దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం, భారత సాయుధ దళాలు ఎంత నిబద్ధతతో ఉన్నాయో చెప్పడానికి 'ఆపరేషన్ సిందూర్‌' ఒక గొప్ప ఉదాహరణ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని ఆయన గుర్తు చేశారు. పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్‌డీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, సైనిక నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఎన్‌డీఏ ప్రాంగణంలో పీష్వా బాజీరావ్ స్మారకాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సముచితమని అభిప్రాయపడ్డారు. "భారత స్వాతంత్ర్య సంగ్రామం ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో ప్రారంభమైంది. ఆ పోరాట స్ఫూర్తిని పీష్వాలు మరో వందేళ్లపాటు ముందుకు నడిపించారు. వారు లేకపోయి ఉంటే మన దేశ ప్రాథమిక స్వరూపం నిలిచిపోయేదే కాదు" అని అమిత్ షా పేర్కొన్నారు.

కేవలం 40 ఏళ్ల వయసులోనే బాజీరావ్ ఎవరూ సాధించలేని విధంగా చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా నగరంలో జైరాజ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ను కూడా ప్రారంభించారు.


More Telugu News