Pakistan: పాకిస్థాన్‌ను ప్రయోగశాలగా వాడుకుంటున్న చైనా: భారత సైన్యం

China Uses Pakistan as Arms Testing Lab Indian Army
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌ను చైనా తమ ఆయుధాలను పరీక్షించేందుకు ఒక ప్రయోగశాలగా మార్చుకుందని, అయితే కీలక సమయాల్లో ఆ ఆయుధాలు విఫలమవుతున్నాయని భారత సైన్యం సంచలన విషయాలు వెల్లడించింది. పాక్‌కు చెందిన 81 శాతం సైనిక సంపత్తి డ్రాగన్ దేశం సరఫరా చేసిందేనని స్పష్టం చేసింది. ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"మనకు వాస్తవంగా ముగ్గురు శత్రువులు. అందులో పాకిస్థాన్ మొదటిది. దానికి చైనా నుంచి అన్ని విధాలా సహాయం అందుతోంది. పాక్ వద్ద ఉన్న 81 శాతం సైనిక హార్డ్‌వేర్ చైనా నుంచి వచ్చిందే. తమ సైనిక పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు పాక్‌ను చైనా ఒక ల్యాబ్‌లా వాడుకుంటోంది" అని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు, డీజీఎంఓ స్థాయి చర్చల సమయంలో భారత సైనిక వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని బీజింగ్ ఎప్పటికప్పుడు ఇస్లామాబాద్‌కు చేరవేసిందని సింగ్ తెలిపారు. పాకిస్థాన్‌కు చైనాతో పాటు టర్కీ నుంచి కూడా మద్దతు లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత క్షిపణులను అడ్డుకోవడంలో పాక్ వద్ద ఉన్న చైనా తయారీ హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గణాంకాల ప్రకారం, 2020-2024 మధ్య చైనా ఆయుధ ఎగుమతుల్లో 63 శాతం ఒక్క పాకిస్థాన్‌కే చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా-పాక్ సైనిక బంధంపై భారత సైన్యం నిశితంగా దృష్టి సారించింది.
Go Back to Shorts
Pakistan
China
Indian Army
military hardware
Operation Sindoor
HQ-9

More Telugu News