Al-Umma Terrorists: దశాబ్దాలుగా రాయచోటిలో మకాం.. అల్-ఉమ్మా ఉగ్రవాదుల అరెస్ట్‌తో విస్తుపోయే నిజాలు

Al Umma Terrorists Arrested in Rayachoti Explosives Seized
షార్ట్స్‌లో చూడండి
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో దశాబ్దాలుగా సాధారణ జీవితం గడుపుతున్న ఇద్దరు వ్యక్తుల ముసుగు తొలగడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'అల్ ఉమ్మా' ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ఉగ్రవాదుల నివాసాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఏకంగా 20 కిలోల బరువున్న సూట్‌కేస్ బాంబు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలోని మూడు మహానగరాలపై దాడి చేసేందుకు వీరు ప్రణాళికలు రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఒక నాన్-బెయిలబుల్ వారెంట్‌పై అబూబకర్ సిద్ధిఖీ (అలియాస్ అమానుల్లా), మహమ్మద్ అలీ (అలియాస్ మన్సూర్) అనే ఇద్దరినీ రాయచోటిలో అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. వీరి అరెస్ట్ అనంతరం ఏపీ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేయగా బాంబుల తయారీకి ఉపయోగించే వైర్లు, స్విచ్‌లు, కంటైనర్లు, ఇతర రసాయనాలు బయటపడ్డాయి. వీటితో పాటు ప్రధాన నగరాల మ్యాప్‌లు, రైల్వే ట్రాక్ రూట్లకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.

లభించిన సామాగ్రితో దాదాపు 30-40 చిన్న బాంబులు లేదా 10 భారీ బాంబులు తయారు చేయవచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులిద్దరూ 1999 కోయంబత్తూరు, 2013 బెంగళూరు మల్లేశ్వరం బాంబు పేలుళ్ల కేసుల్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20-30 ఏళ్లుగా వీరు రాయచోటిలో మారుపేర్లతో స్థిరపడి, స్థానికులకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు.

పోలీసుల సోదాలను అడ్డుకున్నందుకు నిందితుల భార్యలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం చెన్నై జైలులో ఉన్న ప్రధాన నిందితులిద్దరినీ పీటీ వారెంట్‌పై త్వరలో రాయచోటికి తీసుకొచ్చి విచారించనున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఈ విచారణ ద్వారా వీరికి స్థానికంగా ఎవరెవరు సహకరించారు, ఆర్థిక మూలాలు ఏమిటి, వీరి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే పూర్తి వివరాలు రాబడతామని పోలీసులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Al-Umma Terrorists
Rayachoti
Annamayya District
Abu Bakar Siddiqui
Mohammad Ali
Terrorism
Explosives
Bomb Blast
Tamil Nadu Police
Chennai

More Telugu News