విశాఖ తీరంలో కొత్త శోభ.. ప్రారంభమైన క్రూయిజ్ నౌక విహారం

  • విశాఖపట్నంలో సముద్ర విహార నౌక సేవలు ప్రారంభం
  • వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర మంత్రి సోనోవాల్
  • ప్రత్యక్షంగా హాజరై ప్రారంభించిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌
  • నగర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్న మంత్రి దుర్గేశ్‌
  • రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సుందర సాగర నగరం విశాఖపట్నం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సముద్ర విహార నౌక (క్రూయిజ్ షిప్) సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి సోనోవాల్ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొనగా, మంత్రి దుర్గేశ్‌ విశాఖలో ప్రత్యక్షంగా హాజరై జెండా ఊపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ... విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రూయిజ్ టూరిజం ద్వారా విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందని, పర్యాటకుల రాకతో స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో క్రూయిజ్ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తామని మంత్రి దుర్గేశ్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాకారం చేసిన విశాఖ పోర్టు అథారిటీ అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ నూతన సేవలతో విశాఖ పర్యాటక చిత్రపటంలో కీలక స్థానం సంపాదించుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. 



More Telugu News