సుడాన్ లో కుప్పకూలిన బంగారు గని... 11 మంది మృత్యువాత

  • తూర్పు నైలు నది ప్రావిన్స్ లోని హోయిడ్ పట్టణంలో కెర్ష్ అల్ ఫీల్ గనిలో ఘటన
  • మరో ఎనిమిది మందికి గాయాలు
  • మృతి చెందిన 11 మంది మైనర్ కార్మికులే
  • గనిలో తవ్వకాలు నిలివేసినట్లు ప్రకటించిన సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ
బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సూడాన్‌లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా బంగారు గనుల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని కారణంగా గనుల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా తూర్పు సూడాన్‌లోని ఒక బంగారు గనిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

తూర్పు నైలు నది ప్రావిన్స్‌లోని హోయిడ్ పట్టణంలో గల కెర్ష్ అల్ ఫీల్ గనిలో ఈ దుర్ఘటన సంభవించింది. బంగారు గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనతో గనిలో తవ్వకాలను నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. మృతులంతా మైనర్లు కావడం గమనార్హం. 


More Telugu News