రష్యా నుంచి మరిన్ని ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు భారత్ ప్రణాళిక!

  • రష్యా నుంచి మరో రెండు ఎస్ 400 క్షిపణి వ్యవస్థలు కొనుగోలు చేయాలని ప్రణాళిక
  • సుఖోయ్ 30 ఎంకేఐ అప్ గ్రేడ్ చేయాలని ప్లాన్
  • రష్యా, భారత రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
భారతదేశం రష్యా నుండి అదనంగా మరో రెండు స్క్వాడ్రన్‌ల S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400తో పాటు స్వదేశీ డిఫెన్స్ వ్యవస్థలు చాలా బాగా పనిచేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి.

2018లో సంతకం చేసిన 5.43 బిలియన్ల ఒప్పందంలో భాగంగా ఎస్ 400 ట్రయంఫ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు కలిగిన వ్యవస్థపై భారత్, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్‌కు రష్యా అందించాల్సిన మిగిలిన రెండు S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది.

అయితే, వీటిని 2026 – 27 నాటికి పంపిణీ చేస్తామని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ హామీ ఇచ్చారు. చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా వీరు ఇద్దరు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాయి.

ఈ సందర్భంలోనే మరో రెండు S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలానే ఈ చర్చల్లో భారత్ సుమారు 260 ఎస్ యు – 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు ప్రస్తావనకు వచ్చింది. వీటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే ప్లాన్‌లో భాగంగా అప్‌గ్రేడ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలలో ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు మరియు ఇతర కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌లను కలిసి ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయి. 


More Telugu News