Stock Market: మార్కెట్ల లాభాల జోరు.. వరుసగా నాలుగో రోజు పరుగులు!

Stock Market Gains Continue for Fourth Consecutive Day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర నాలుగో రోజు కూడా కొనసాగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కీలక షేర్లలో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరోసారి 84 వేల మార్కును అధిగమించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,600 పైన ముగిసింది.

ట్రేడింగ్ వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం సెన్సెక్స్ 83,774 పాయింట్ల వద్ద దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, కొద్దిసేపటికే పుంజుకుని లాభాల బాట పట్టింది. రోజంతా సానుకూలంగానే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 84,089పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు, క్రితం ముగింపుతో పోలిస్తే 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 88 పాయింట్లు పెరిగి 25,637 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. అయితే ట్రెంట్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.48 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 68.32 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు ధర 3,300 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Reliance Industries
ICICI Bank
Asian Paints
Rupee Value
Brent Crude Oil
Gold Price

More Telugu News