జపాన్‌ను వణికించిన 'ట్విట్టర్ కిల్లర్'కు ఉరిశిక్ష అమలు

Japan executes Twitter killer who had murdered 9 people
షార్ట్స్‌లో చూడండి
జపాన్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన 'ట్విట్టర్ కిల్లర్' కథ ముగిసింది. తన అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి శరీరాలను ముక్కలుగా నరికిన కేసులో దోషిగా తేలిన తకాహిరో షిరాయిషిని శుక్రవారం ఉరితీశారు. ఈ విషయాన్ని జపాన్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2017లో జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. 2020లో అతనికి మరణశిక్ష విధించింది.

అసలేం జరిగింది?
సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ దారుణాల పరంపర యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్న యువతీ యువకులను షిరాయిషి లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి సహాయం చేస్తానని, వారి కోరిక తీరుస్తానని నమ్మించి తన అపార్ట్‌మెంట్‌కు పిలిచేవాడు. అలా వచ్చిన వారిని దారుణంగా హత్య చేసేవాడు.

మృతులలో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మహిళా బాధితులపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాతే వారిని చంపినట్లు విచారణలో తేలింది. బాధితురాళ్లలో ఒకరి బాయ్‌ఫ్రెండ్‌కు ఈ విషయం తెలియడంతో అతడిని కూడా హత్య చేసి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు.

నేరం ఎలా బయటపడింది?
2017లో షిరాయిషి అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సోదాలు చేయగా కోల్డ్-స్టోరేజ్ బాక్సులలో ముక్కలుగా నరికిన స్థితిలో ఉన్న తొమ్మిది మృతదేహాలను గుర్తించి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో షిరాయిషి తన నేరాలన్నింటినీ అంగీకరించాడు.

టోక్యో డిటెన్షన్ హౌస్‌లో శుక్రవారం ఉదయం షిరాయిషికి ఉరిశిక్షను అత్యంత రహస్యంగా అమలు చేశారు. శిక్ష పూర్తయిన తర్వాతే ప్రభుత్వం ఈ విషయాన్ని బయటపెట్టింది. జపాన్‌లో మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో ఈ ఉరిశిక్ష అమలు కావడం గమనార్హం. జపాన్‌లో ఆత్మహత్యల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండగా, కరోనా మహమ్మారి తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక బలహీనతతో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని షిరాయిషి ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు.
Go Back to Shorts
Twitter Killer
Takahiro Shiraishi
Japan murders
serial killer
Tokyo
social media crime
crime news
Japan crime
murder case
internet crime

More Telugu News