అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. ఐఎస్‌ఎస్ నుంచి భారత్‌‍కు ప్రత్యేక సందేశం!

Shubhanshu Shukla sends special message to India from ISS
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి భూమిని వీక్షించే అరుదైన అవకాశం దక్కించుకున్న కొద్దిమందిలో ఒకరిగా నిలవడం తన అదృష్టమని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సంతోషం వ్యక్తం చేశారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన తొలిసారిగా ఐఎస్‌ఎస్‌లో అడుగుపెట్టారు. భూమి నుంచి సుమారు 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న శుభాంశు, అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించిన వెంటనే అక్కడున్న ఇతర వ్యోమగాములతో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ, "ప్రియమైన నా తోటి భారతీయులకు నాదొక చిన్న సందేశం. నేను 634వ వ్యోమగామిని. ఇక్కడకు రావడం చాలా గర్వంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఐఎస్‌ఎస్‌కు చేరుకోగలిగాను. ఇక్కడ నిలబడటం చూడటానికి తేలికగానే ఉన్నప్పటికీ, నా తల కొంచెం భారంగా కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇవి చాలా చిన్న విషయాలు, కొన్ని రోజుల్లో అన్నీ అలవాటైపోతాయి. ఈ ప్రయాణంలో ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో మేమంతా కలిసి శాస్త్రీయ పరిశోధనలు చేపడతాం. మీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా, ఉత్తేజభరితంగా ఉంది. నా భుజంపై భారత పతాకాన్ని ఎంతో గర్వంతో ధరించాను. నా ప్రయాణం పట్ల మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.

సహచర వ్యోమగాముల గురించి ప్రస్తావిస్తూ "అంతరిక్షంలోకి రావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇక్కడ ఉన్న వ్యోమగాములు మాకు తలుపులు తెరిచి స్వాగతం పలుకుతుంటే, సొంత ఇంట్లోకి ఆహ్వానించినట్లు అనిపించింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన, కొత్త అనుభూతి. ఇక్కడికి వచ్చే ముందు నాకున్న అంచనాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. రాబోయే 14 రోజుల పాటు శాస్త్ర పరిశోధనల్లో భాగంగా మీతో కలిసి పనిచేస్తాననే పూర్తి విశ్వాసం నాకు ఉంది" అని శుభాంశు వివరించారు.

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌-9 రాకెట్ ద్వారా భారత్‌కు చెందిన శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్‌, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నీవ్‌స్కీ, హంగరీకి చెందిన టిబర్‌ కపు అంతరిక్షంలోకి పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రానికి ఐఎస్‌ఎస్‌కు చేరుకుంది. సాయంత్రం 4:03 గంటలకు డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అనంతరం కొద్దిసేపటికే వ్యోమగాముల బృందం ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించింది. ఈ మిషన్‌లో భాగంగా వీరంతా 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపి, పలు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నారు.
Go Back to Shorts
Shubhanshu Shukla
ISS
International Space Station
Axiom-4 Mission
Space Travel
Indian Astronaut

More Telugu News