ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. బీజేపీ గూటికి సీనియర్ నటి?

ప్రముఖ సినీ నటి మీనా ఇటీవల భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా పేరుపొందిన మీనా, తన 45 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆమె భర్త విద్యాసాగర్ 2022లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మీనా తన కుమార్తె నైనికతో కలిసి ఉంటున్నారు. నైనిక కూడా విజయ్ నటించిన ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) చిత్రంలో బాలనటిగా కనిపించింది.

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మీనా, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరనున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ వార్తలపై మీనా వైపు నుంచి గానీ, బీజేపీ వర్గాల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఈ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. 

Meena
Meena actress
Jagdeep Dhankhar
BJP
Indian Vice President
actress Meena BJP
Tamil actress
Nainika
actress political entry
Delhi

More Telugu News