ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ: ట్రంప్ సంచలన ప్రకటన
- 12 రోజుల యుద్ధం ముగిసిందన్న అమెరికా అధ్యక్షుడు
- 24 గంటల్లో దశలవారీగా ఒప్పందం అమలు అని వెల్లడి
- ఇంకా అధికారికంగా ప్రకటించని ఇజ్రాయెల్, ఇరాన్
- ఇటీవలే తీవ్రమైన ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు
గత 12 రోజులుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణను 12 రోజుల యుద్ధంగా ట్రంప్ అభివర్ణించారు. "అందరికీ అభినందనలు! ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణకు పూర్తిస్థాయిలో అంగీకారం కుదిరింది. (సుమారు 6 గంటల్లో, ఇజ్రాయెల్, ఇరాన్ తమ చివరి కార్యకలాపాలను ముగించుకున్న తర్వాత) 12 గంటల పాటు ఇది అమలవుతుంది. ఆ తర్వాత యుద్ధం ముగిసినట్లుగా పరిగణించబడుతుంది!" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం తొలుత ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభిస్తుందని, 12 గంటల తర్వాత యూదు దేశమైన ఇజ్రాయెల్ కూడా ఇందులో పాలుపంచుకుంటుందని ట్రంప్ వివరించారు. మరో 12 గంటల తర్వాత "12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపును ప్రపంచం మొత్తం స్వాగతిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
"అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు రెండూ చూపిన ధైర్యం, తెగువ, తెలివితేటలకు నా అభినందనలు. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి, యావత్ మధ్యప్రాచ్యాన్ని నాశనం చేసేది. కానీ అలా జరగలేదు, ఇకపై జరగదు కూడా!" అని ట్రంప్ తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, ట్రంప్ ప్రకటన వెలువడినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నుంచి కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ ఒప్పందం వాస్తవికతపై నీలినీడలు కమ్ముకున్నాయి.