Ambati Rambabu: మరిన్ని చిక్కుల్లో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో ఆయనతోపాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

కాగా, సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో అంబటిపై మరో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా కొర్రపాడు వద్ద అంబటి, ఆయన సోదరుడు మురళితో కలిసి గందరగోళం సృష్టించారని, అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారని, వారించేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిని అంబటి నెట్టివేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 188 (ప్రభుత్వాధికారి జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడం), 332 (ప్రభుత్వోద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 353 (ప్రభుత్వోద్యోగిపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం), 427 (ఆస్తి నష్టం కలిగించడం) కింద సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Ambati Rambabu
YSRCP
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Police Case
Rentapalla
Guntur
Law Violation
Political News

More Telugu News