ట్రంప్‌ను నోబెల్ ప్రైజ్‌కు నామినేట్ చేసిన పాకిస్థాన్

  • 2026 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిపాదించిన పాకిస్థాన్
  • భారత్-పాక్ మధ్య ఇటీవల ఘర్షణల నివారణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని వెల్లడి
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ట్రంప్ భేటీ తర్వాత ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నామినేషన్ ప్రకటన వెలువడటానికి కొన్ని రోజుల ముందే అంటే బుధవారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. అయితే, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇటీవలే ‘ఫీల్డ్ మార్షల్’ హోదా పొందిన అసిమ్ మునీర్ గతంలోనే ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వాదించారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం సంభవించకుండా ట్రంప్ నిరోధించారని ఆయన ప్రశంసించారు.

 కాగా, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్ నుంచి అందిన ఆహ్వానాన్ని పాకిస్థాన్ అధికారులు ఒక పెద్ద దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు. మునీర్ ఇటీవలే ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందారు. 1959లో అయూబ్ ఖాన్ తర్వాత ఈ హోదా పొందిన రెండవ అధికారి ఆయనే కావడం విశేషం.


More Telugu News