చివరి క్షణంలో చాకచక్యంతో భారీ ప్రాణనష్టం తప్పించిన పైలట్లు.. ప్రత్యక్ష సాక్షుల కథనం

  • జనావాసాలపై పడి ఉంటే 2 వేల మంది వరకు చనిపోయేవారని వెల్లడి
  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఘోర ప్రమాదం
  • టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మెడికల్ హాస్టల్‌పై పడ్డ విమానం
  • ప్రమాదంలో విమానంలోని 241 మంది, హాస్టల్‌లోని 33 మంది మృతి
  • ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు మినహా అందరూ, విమానం కూలిన ప్రదేశంలోని హాస్టల్‌లో ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ చివరి క్షణంలో చాకచక్యంగా వ్యవహరించడం వల్లే, విమానం జనసాంద్రత అధికంగా ఉండే నివాస ప్రాంతాలపై పడకుండా, పెను విషాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ 171, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మేఘాని నగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్‌పై కూలిపోయింది. విమానం 825 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత అదుపుతప్పి కిందకు పడిపోయిందని ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆకాశంలోకి అగ్నికీలలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌ మీదుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

ప్రత్యక్ష సాక్షి  ఏమ‌న్నారంటే..!
"ప్రమాదం జరిగినప్పుడు మేము క్రికెట్ ఆడుకుంటున్నాం. విమానం మా పైనుంచే, చాలా దగ్గరగా వెళ్లింది" అని ఘటనను కళ్లారా చూసిన ఒక స్థానికుడు సీఎన్ఎన్-న్యూస్18కి తెలిపారు. "ప్రమాదం తర్వాత అంతా గందరగోళంగా మారింది. మేమంతా వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తుకెళ్లి, సుమారు 15 నుంచి 20 మందిని రక్షించగలిగాం. సాధారణంగా విమానాలు చాలా ఎత్తులో వెళ్తాయి. కానీ ఇది ఇళ్లకు చాలా దగ్గరగా వచ్చింది. జనావాసాలపై పడకుండా విమానాన్ని పక్కకు మళ్లించిన పైలట్‌కు సెల్యూట్ చేయాలి. లేకపోతే సుమారు 1,500 నుంచి 2,000 మంది చనిపోయేవారు" అని ఆయన తెలిపారు.


More Telugu News