'ఇది మా చరిత్రలోనే చీకటి రోజు': ఎయిర్ ఇండియా ఘటనపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఆవేదన

N Chandrasekaran on Air India Accident Darkest Day in History
షార్ట్స్‌లో చూడండి
అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం జరిగిన విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 265 మంది చ‌నిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా నిలిచిపోయింది.

ఈ దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ క్షణంలో మేం అనుభవిస్తున్న దుఃఖాన్ని మాటల్లో వర్ణించలేం. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు, గాయపడిన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల‌కు, వారి కుటుంబాలకు తమ గ్రూప్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. "మేము ఈ గ్రూప్‌ను నమ్మకం, బాధ్యత పునాదులపై నిర్మించాం. ఇది చాలా కష్టమైన సమయం. కానీ, మా బాధ్యతగా బాధితుల‌కు స‌హాయం చేయడం నుంచి మేం వెనక్కి తగ్గేది లేదు. ఈ నష్టాన్ని మేం భరిస్తాం. దీన్ని మేం ఎప్పటికీ మర్చిపోం" అని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.

తక్షణ సహాయ చర్యగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారి వైద్య ఖర్చులను కూడా కంపెనీయే భరించనుంది. అలాగే ప్రమాదం వల్ల ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజీలోని హాస్టల్ పునర్నిర్మాణానికి కూడా సహాయం అందించనున్నట్లు తెలిపింది.

"వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత ఈ విషాదం ఎలా జరిగిందనే దానిపై మేం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం. ఎంతో మంది నమ్మకాన్ని చూరగొన్న గ్రూప్‌గా, ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వడమే మా ప్రథమ ప్రాధాన్యత. అందులో ఎలాంటి రాజీ లేదు" అని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతపై విస్తృత తనిఖీలకు ఆదేశించింది.

బాధిత కుటుంబాలకు సమాచారం అందించడానికి, సహాయం చేయడానికి ఎమర్జెన్సీ హాట్‌లైన్‌లు, సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో సంక్షోభ నిర్వహణలో కారుణ్యం, పారదర్శకతలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
Go Back to Shorts
N Chandrasekaran
Tata Sons
Air India
Air India crash
Ahmedabad
Flight AI 171
Boeing 787 Dreamliner
DGCA
Aviation accident
Tata Group

More Telugu News