Parameshwara: పిరికిపందలా పారిపోను.. తొక్కిసలాటపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు!

Parameshwara Responds to Resignation Demands After Bengaluru Stampede
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తనపై వస్తున్న రాజీనామా డిమాండ్లపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తీవ్రంగా స్పందించారు. పిరికిపందలా పారిపోను అంటూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఆయన తాజాగా స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వస్తాయని, అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు.

జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం వెలుపల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, మరికొందరిని బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని, అసలు బాధ్యులైన మంత్రులను కాపాడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రమంత్రి కుమారస్వామి మరో అడుగు ముందుకేసి, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య, శివకుమార్‌లను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటానికి అనుమతించడం, ఆ తర్వాత తలెత్తిన గందరగోళానికి వారిద్దరే కారణమని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి పరమేశ్వర... దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ధారణలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా విచారణ జరిపిస్తామని, దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, తొక్కిసలాటలో మరణాలు సంభవించిన విషయం తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని, ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Go Back to Shorts
Parameshwara
Karnataka Home Minister
Bengaluru Stampede
RCB IPL
Siddaramaiah
DK Shivakumar
HD Kumaraswamy
Chinnaswamy Stadium

More Telugu News