Bengaluru Stampede: బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. వెలుగులోకి కీల‌క విష‌యం!

Last Minute Planning Led To Bengaluru Stampede June 3 Letter Contradicts
షార్ట్స్‌లో చూడండి
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న‌ సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. 

ఈ ఘటనతో సంబరాలు కాస్త విషాదంగా మారాయి. ప్రస్తుతం ఈ దుర్ఘటనకు బాధ్యులెవరనే దానిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 

అనుమతులపై గందరగోళం
ఈ సన్మాన కార్యక్రమాన్ని చివరి నిమిషంలో ప్లాన్ చేశారని, అభిమానుల రాకను తక్కువగా అంచనా వేశామని కర్ణాటక ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే, జూన్ 3వ తేదీన రాసిన ఒక లేఖ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతోంది. ఓ ప్రముఖ వార్తా సంస్థకు లభించిన ఈ లేఖ ప్రకారం, ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే విధానసౌధ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ముందస్తుగానే అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం (డీపీఏఆర్) ఈ అభ్యర్థనను పోలీసు శాఖకు పంపినట్లు సమాచారం. అయితే, విధానసౌధ వద్ద కార్యక్రమానికి అనుమతించేందుకు పోలీసులు అంగీక‌రించ‌లేద‌ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు?
బుధవారం కాకుండా ఆదివారం వరకు వేడుకలను వాయిదా వేయాలని ప్రభుత్వం, ఆర్సీబీ యాజమాన్యాన్ని పోలీసులు కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆదివారం నాటికి అభిమానుల భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయని పోలీసులు భావించారు. అయితే, ఆదివారం నాటికి విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోతారని, సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేరని ఫ్రాంచైజీ వాదించినట్లు తెలుస్తోంది. "ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ ప్లేయ‌ర్లు రెండు రోజుల్లో వెళ్లిపోతారనేది వారి వాదన" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

దాదాపు రెండు లక్షల మంది అభిమానులు విజయోత్సవ ర్యాలీ, వేడుకల కోసం స్టేడియం వెలుపల గుమిగూడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఫలితంగా జరిగిన గందరగోళంలో 11 మంది మృతి చెందగా, 45 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.
Go Back to Shorts
Bengaluru Stampede
Royal Challengers Bangalore
RCB
RCB IPL Win
Chinnaswamy Stadium
Karnataka State Cricket Association
KSCA
IPL Trophy
Fan Celebration
Police Investigation

More Telugu News