Anagani Satya Prasad: వెన్నుపోటు దినం కాదు... పశ్చాత్తాప దినం చేసుకోండి: మంత్రి అనగాని

Anagani Satya Prasad Slams Jagan Reddy on Betrayal Day
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన నాటి పాలకులకు ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు చాచి కొట్టినట్లు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి... మాజీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మోసానికి జగన్ నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, కానీ అందుకు భిన్నంగా 'వెన్నుపోటు దినం' అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని అనగాని ఎద్దేవా చేశారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు 'పశ్చాత్తాప దినం'గా జరుపుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే వారికి అలవాటైన రీతిలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

తల్లికి, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న జగన్‌ను ప్రజలు ఎలా విశ్వసిస్తారని అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఆయన ఇదే రకమైన వైఖరితో ముందుకు సాగితే, రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారి, చివరికి సున్నాకు చేరుకుంటుందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సుపరిపాలన అందిస్తోందని, దీనిని చూసి ఓర్వలేని వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Anagani Satya Prasad
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
TDP
Chandrababu Naidu
coalition government
June 4th
election results
political criticism

More Telugu News