ఆపరేషన్ సిందూర్ పై మీ స్పందన బాలేదు.. కొలంబియాకు ముఖమ్మీదే చెప్పేసిన శశిథరూర్ బృందం

Shashi Tharoor Team Expresses Displeasure Over Colombias Response to Operation Sindoor
షార్ట్స్‌లో చూడండి
ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని, భారత్ పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొలంబియాకు వెళ్లిన శశిథరూర్ నేతృత్వంలోని బృందం గురువారం అక్కడి మీడియాతో మాట్లాడింది. ఉగ్రవాదంపై కొలంబియా వైఖరి సరిగ్గాలేదని ఆ దేశ మీడియా ముందే వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ లో మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొలంబియా స్పందన పట్ల భారత్ అసంతృప్తి చెందిందని పేర్కొంది.

చనిపోయిన ఉగ్రవాదులకు సంతాపం తెలపడమేంటని ప్రశ్నించింది. పహల్గామ్ దాడిలో చనిపోయిన అమాయక పర్యాటకులు, ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ఉగ్రవాదులు ఒకటి కాదని చెప్పింది. ఉగ్రవాదులను పంపేవారికి, ఆ ఉగ్రవాదులను ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం ప్రతిదాడులు చేసేవారికి చాలా వ్యత్యాసం ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఆ రెండు వర్గాలను ఒకే గాటన కట్టడం సరికాదని చెప్పారు.

శశి థరూర్ మాట్లాడుతూ, "ఉగ్రవాదులను పంపించే శక్తులు, వారి దాడుల నుంచి తమను తాము కాపాడుకునే వారు ఎప్పటికీ సమానం కారు. ఒకటి విధ్వంసకర చర్య అయితే, మరొకటి ఆత్మరక్షణ చర్య" అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేవారితో, దానిని ఎదుర్కొంటూ తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేసేవారిని ఒకేలా చూడటం అనేది సమంజసం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ రెండు వర్గాల మధ్య నైతికంగా, చట్టపరంగా కూడా స్పష్టమైన వ్యత్యాసం ఉందని థరూర్ పరోక్షంగా సూచించారు.

ఒకరి చర్యలు అమాయకుల ప్రాణాలను బలిగొంటే, మరొకరి చర్యలు తమ వారిని కాపాడుకోవడానికి ఉద్దేశించినవని ఆయన అన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారు, వాటిని ప్రతిఘటించేవారు ఒకే తానులోని ముక్కలు కాదని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అస్పష్టతకు తావులేదని, ఈ రెండింటినీ వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
Go Back to Shorts
Shashi Tharoor
Operation Sindoor
Colombia
India
Terrorism
Pahalgam attack
Indian MPs
Pakistan
Terrorist attacks

More Telugu News