ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు

  • ఏపీలో శుక్రవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
  • తీరం దాటిన వాయుగుండం
  • దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
రేపు (మే 30) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

కాగా, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. 

అటు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది నేటి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవి, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరం దాటింది.

మరోవైపు, నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం పరిస్థితులు కూడా రుతుపవనాల కదలికలకు తోడ్పడుతున్నాయి. 


More Telugu News