మ‌ళ్లీ వ‌చ్చేస్తోన్న ఎన్‌టీఆర్ బేబీ కిట్‌.. స‌ర్వత్రా హ‌ర్షం

  • 2016లో మొదలైన ఎన్‌టీఆర్ బేబీ కిట్ పథకం
  • 2020లో నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం
  • ఇటీవలే పథకం కోసం నిధుల మంజూరు
  • వచ్చే నెల నుంచి ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో పథకం అమ‌లుకు కార్యాచ‌ర‌ణ‌
  • ఎన్‌టీఆర్ బేబీ కిట్‌లో రూ. 1410 విలువ చేసే 11 రకాల వస్తువులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలను ప్రసవించే మహిళలు, శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్‌టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 

దీంతో వచ్చే నెల నుంచి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఈ పథకం మొదలవుతుందని స‌మాచారం. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఏటా వేలాది కాన్పులు జరుగుతాయి. ఎన్‌టీఆర్ బేబీ కిట్లు మళ్లీ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుంది.

టీడీపీ ప్రభుత్వం 2016 జులైలో ఎన్‌టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, 2019లో వైసీపీ సర్కారు ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్‌ బేబీ కిట్లుగా మార్చింది. ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప్ర‌స‌వాలు చేసుకున్న ల‌క్ష‌లాది మంది  మహిళలు లబ్ది పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో స‌ర్వాత్ర హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. 

ఎన్‌టీఆర్ బేబీ కిట్‌లో రూ. 1410 విలువ చేసే 11 రకాల వస్తువులు 
ఇక, రూ. 1410 విలువ చేసే ఎన్‌టీఆర్ బేబీ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయి. చిన్నారికి దోమతెరతో కూడిన బెడ్, బేబీ డ్రస్, బేబీ సబ్బు, పౌడర్, బేబీ ఆయిల్, బొమ్మ, న్యాప్‌కిన్, టవల్స్, వాటర్‌ ప్రూఫ్‌ కాట్‌ షీట్, బేబీ షాంపూ, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి ద్రావ‌ణం ఉంటాయి. వీటి విలువ రూ. 1410గా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరుగుతాయని సూప‌రింటెండెంట్ శ్రీనివాస‌రెడ్డి అన్నారు.


More Telugu News