ఉబెర్‌కు కేంద్రం నోటీసులు... 'అడ్వాన్స్ టిప్'‌పై ఆగ్రహం

  • వేగవంతమైన సేవ కోసం ప్రయాణికుల నుంచి 'అడ్వాన్స్ టిప్' 
  • రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబెర్‌కు నోటీసులు జారీ చేసిన సీసీపీఏ
  • ఇది అనుచిత వ్యాపార విధానమన్న కేంద్రం 
  • టిప్ అనేది ప్రశంసపూర్వకంగా ఇచ్చేది, హక్కుగా వసూలు చేసేది కాదని వ్యాఖ్యలు
ప్రముఖ రవాణా సేవల సంస్థ ఉబెర్ ప్రవేశపెట్టిన 'అడ్వాన్స్ టిప్' విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వేగంగా క్యాబ్ సేవలు పొందేందుకు ప్రయాణికుల నుంచి ముందస్తుగా టిప్ వసూలు చేయడాన్ని తప్పుబడుతూ, దేశ అత్యున్నత వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అయిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఉబెర్‌కు నోటీసులు జారీ చేసింది.

క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో, త్వరితగతిన పికప్ కోసం అదనంగా 'టిప్' జోడించే సదుపాయాన్ని ఉబెర్ ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ విధానంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఆదేశాలతో సీసీపీఏ రంగంలోకి దిగి ఉబెర్‌కు వివరణ కోరుతూ నోటీసులు పంపింది.

ఈ అంశంపై మంత్రి ప్రహ్లాద్ జోషి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను ముందస్తు టిప్ చెల్లించమని బలవంతపెట్టడం లేదా ప్రేరేపించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది నైతికంగా సరైంది కాదు, దోపిడీ కిందకే వస్తుంది. ఇటువంటి చర్యలు అనుచిత వ్యాపార విధానాల (అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్) పరిధిలోకి వస్తాయి" అని పేర్కొన్నారు.

టిప్ అనేది సేవలు పొందిన తర్వాత, ప్రశంసపూర్వకంగా ఇచ్చేదని, అంతేకానీ హక్కుగా వసూలు చేసేది కాదని మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులతో జరిపే అన్ని లావాదేవీలలో న్యాయబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.

మరోవైపు, ఈ 'అడ్వాన్స్ టిప్' విధానంపై ఉబెర్ తన పాలసీని వివరిస్తూ, ఈ టిప్ మొత్తం డ్రైవర్లకే చెందుతుందని, ఒకవేళ ప్రయాణికులు కావాలనుకుంటే తర్వాత ఆ మొత్తాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉందని తెలిపింది. అయితే, ఈ విధానం వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ ఉబెర్ నుంచి పూర్తిస్థాయి వివరణ కోరింది. సంస్థ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News