Telangana Rains: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Telangana Rains Yellow Alert Issued for Several Districts
  • బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనంతో తెలంగాణలో వర్షాలు
  • రానున్న నాలుగు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు
  • కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • 5 డిగ్రీల వరకు తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి, పగటి ఉష్ణోగ్రతలు సుమారు ఐదు డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ముందుగానే కేరళకు నైరుతి

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మే 24వ తేదీనే కేరళలోకి ప్రవేశించి, జూన్ మొదటి వారంలోపు తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.
Telangana Rains
Telangana Weather
Hyderabad Weather
Rain Alert
Yellow Alert
IMD

More Telugu News