గుండెలు పిండేసే దృశ్యం... బిడ్డలను హత్తుకుని అగ్నికీలలకు ఆహుతైన మహిళ!
- హైదరాబాద్ చార్మినార్ వద్ద ఘోర అగ్నిప్రమాదం
- ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం
- మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు
కళ్లారా చూసిన ఘోరం... స్థానికుడి ఆవేదన
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న గాజుల వ్యాపారి జాహిద్, ఆ భయానక దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. "మంటలు ఎగిసిపడుతుండగానే మేము లోపలికి వెళ్లాం. ఒక గదిలో, ఆ తల్లి తన పిల్లలను మంటల నుంచి కాపాడేందుకు గట్టిగా హత్తుకుని ఉంది. ఆ కౌగిలిలోనే వారు కాలిపోయి కనిపించారు. ఆ దృశ్యం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది" అని జాహిద్ కన్నీటిపర్యంతమయ్యారు. తాము 13 మందిని బయటకు తీసుకువచ్చామని, అయితే దట్టమైన పొగ కారణంగా ఏమీ కనిపించలేదని, గోడ పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. చాలా మంది మంటల్లో కాలిపోగా, మరికొందరు పొగతో ఊపిరాడక మరణించారని ఆయన వివరించారు.