Narendra Modi: ఎస్-400 ముందు సగర్వంగా నిలబడి సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ

PM Modis Defiant Stand Before S400 Amidst Pakistans Claims
షార్ట్స్‌లో చూడండి
భారత వాయు రక్షణ వ్యవస్థ ఎస్-400ను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు. మంగళవారం నాడు పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, అక్కడ మోహరించి ఉన్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఈ చర్య ద్వారా, పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు.

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం, పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) తమ హైపర్‌సోనిక్ క్షిపణులతో అదంపూర్‌లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నకిలీ వీడియోలను కూడా ప్రచారంలో పెట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి, అక్కడి వాయుసేన యోధులతో ముచ్చటించారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో చురుగ్గా వ్యవహరించిన ఈ వైమానిక స్థావరంపై గత వారం పాకిస్థాన్ దాడికి యత్నించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రధాని పర్యటనకు ముందే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేసింది. ఎస్-400 వ్యవస్థకు, బ్రహ్మోస్ క్షిపణి స్థావరానికి నష్టం కలిగించామన్న పాక్ వాదనలను తీవ్రంగా ఖండించింది. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, "పాకిస్థాన్ తమ జేఎఫ్-17 విమానాలతో మా ఎస్-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను దెబ్బతీశామని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అలాగే, సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మన వైమానిక క్షేత్రాలు దెబ్బతిన్నాయని కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి" అని స్పష్టం చేశారు.

ఎస్-400 'సుదర్శన చక్ర' ప్రత్యేకతలు'

ఎస్-400 'ట్రయంఫ్' గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి భారత్ సేకరించింది. దీనికి 'సుదర్శన చక్ర' అని భారత్ నామకరణం చేసింది. మహాభారతంలోని సుదర్శన చక్రంలాగే కచ్చితత్వం, వేగం, విధ్వంసక సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతం. రష్యాకు చెందిన అల్మాజ్-ఆంటెయ్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, ప్రపంచంలోని అత్యంత ఆధునిక క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. 2018లో రష్యాతో 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం ద్వారా భారత్ ఐదు ఎస్-400 యూనిట్లను సమకూర్చుకుంది. మొదటి వ్యవస్థను 2021లో పంజాబ్‌లో మోహరించారు. 

ఇది 400 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగలదు, 600 కిలోమీటర్ల దూరంలోని ముప్పులను గుర్తించగలదు. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో సహా వివిధ రకాల లక్ష్యాలను ఇది ఎదుర్కోగలదు. అత్యాధునిక ఫేజ్డ్-అర్రే రాడార్‌తో, ఏకకాలంలో 100కు పైగా లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. కీలక సైనిక, పౌర ఆస్తుల రక్షణలో ఇది భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
Go Back to Shorts
Narendra Modi
S-400 Triumph
Pakistan
India
Air Defense System
Adampur Air Base
Operation Sindhudurg
Hypersonic Missiles
Almaz-Antey
Brahmos Missile

More Telugu News