కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్... ఎవరికీ తెలియని విషయం వెల్లడించిన సచిన్

  • విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన
  • కోహ్లీ నిర్ణయంపై దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ భావోద్వేగ స్పందన
  • తన చివరి టెస్ట్ సమయంలో కోహ్లీ చూపిన ప్రత్యేక అభిమానాన్ని గుర్తుచేసుకున్న సచిన్
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 14 ఏళ్ల పాటు కొనసాగిన తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ, 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకు కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని అందరితో పంచుకున్నాడు.

సచిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ..."ఇప్పుడు నువ్వు టెస్టుల నుంచి రిటైర్ అవుతున్న ఈ సమయంలో, 12 ఏళ్ల క్రితం నా చివరి టెస్టు నాటి నీ అభిమానం గుర్తుకొస్తోంది. అప్పుడు నీవు నీ దివంగత తండ్రికి చెందిన పవిత్రమైన దారాన్ని నాకు కానుకగా ఇవ్వజూపావు. అది చాలా వ్యక్తిగతమైనది కావడంతో నేను దాన్ని స్వీకరించలేకపోయాను. కానీ నీ ఆత్మీయత నా హృదయాన్ని తాకింది, నా మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బదులుగా నీకివ్వడానికి నా దగ్గర అలాంటి దారం లేకపోయినా, నా ప్రగాఢమైన అభిమానం, శుభాకాంక్షలు నీకు ఎప్పుడూ ఉంటాయని తెలుసుకో" అని సచిన్ పేర్కొన్నాడు.

కోహ్లీ వారసత్వం గురించి స్పందిస్తూ, "విరాట్, నీ అసలైన వారసత్వం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చి, వారిని ఆటవైపు నడిపించడమే" అని సచిన్ పేర్కొన్నాడు"నీ టెస్ట్ కెరీర్ ఎంత అద్భుతంగా సాగింది! కేవలం పరుగులే కాదు, అంతకు మించి ఎంతో భారత క్రికెట్‌కు అందించావు. కొత్త తరం ఉద్వేగభరిత అభిమానులను, ఆటగాళ్లను క్రికెట్‌కు ఇచ్చావు. నీ విశిష్టమైన టెస్ట్ కెరీర్‌కు అభినందనలు" అని టెండూల్కర్ కొనియాడాడు.


More Telugu News