కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా పీఆర్‌సీ ఊసే లేదు: ఏపీ అమరావతి జేఏసీ నేత బొప్పరాజు

  • ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న బొప్పరాజు
  • రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని వినతి
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్న బొప్పరాజు   
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా పీఆర్సీ కమిటీని ప్రకటించకపోవడం శోచనీయమని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఆక్రమణలకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే రెవెన్యూ ఉద్యోగులు ముద్దాయిలుగా మారుతున్నారని, గుంటూరు ఘటనలో డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావు ఇలాగే బలైపోయారని చెప్పుకొచ్చారు.

రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. రెవెన్యూ విధుల నిర్వహణకు సరిపడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు. 


More Telugu News