Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్: నెటిజన్లు ఏం చేయాలి... ఏం చేయకూడదు?

Operation Sindhoor Guidelines for Netizens
షార్ట్స్‌లో చూడండి
ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేయగా... ఓటీటీ వేదికలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బీ) దిశానిర్దేశం చేసింది. ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాలని ఈ సూచనల ద్వారా ప్రభుత్వం కోరింది.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్‌లో వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన 'చేయాల్సినవి, చేయకూడనివి' జాబితాను విడుదల చేసింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ఈ వివరాలను పంచుకుంది. 

"క్లిష్టమైన ఆన్‌లైన్ భద్రతా హెచ్చరిక. సైబర్ భద్రతా జాగ్రత్తలను ఎల్లప్పుడూ పాటించండి. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి - వలల్లో లేదా తప్పుడు సమాచారంలో చిక్కుకోవద్దు. దేశభక్తితో, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండండి. #డిజిటల్ఇండియా #ఆపరేషన్ సిందూర్" అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన పోస్టులో పేర్కొంది.

ముఖ్య సూచనలు:

చేయాల్సినవి:
* అధికారిక సలహాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, ధృవీకరించబడిన సహాయక చర్యల సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలి.
* ఏదైనా వార్తను ఇతరులకు పంపే ముందు అధికారిక వనరులతో దాని వాస్తవికతను నిర్ధారించుకోవాలి.
* నకిలీ వార్తలు లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలి.

చేయకూడనివి:
* సైనిక దళాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోకూడదు.
* ధృవీకరించని సమాచారాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయకూడదు.
* హింసను ప్రేరేపించే లేదా మత ఘర్షణలకు దారితీసే పోస్టులకు దూరంగా ఉండాలి.

తప్పుడు సమాచారం లేదా వదంతులపై ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ (8799711259) మరియు ఈమెయిల్ ([email protected]) చిరునామాను కూడా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఓటీటీలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు:
మరోవైపు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బీ) కూడా ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

"జాతీయ భద్రత దృష్ట్యా, భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, మధ్యవర్తులు... పాకిస్థాన్‌కు చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైనా లేదా ఇతరత్రా అందుబాటులో ఉన్నా వర్తిస్తుంది" అని మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 
Go Back to Shorts
Operation Sindhoor
Indian Government
Cyber Security
Online Safety
Digital India
Misinformation
Fake News
OTT Platforms
Social Media
Ministry of Electronics and IT

More Telugu News