Omar Abdullah: పఠాన్కోట్లో పాక్ డ్రోన్ దాడులు తిప్పికొట్టిన భారత్.. ఎవరూ బయటకు రావొద్దని ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి

- జమ్ము, సాంబా, పఠాన్కోట్లపై మరోసారి పాకిస్థాన్ డ్రోన్ దాడులు
- కొన్ని గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ఒమర్ అబ్దుల్లా సూచన
- వీధుల్లోకి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచన
- వదంతులను నమ్మవద్దని, ధ్రువీకరించని వార్తలు వ్యాప్తి చేయొద్దని అభ్యర్థన
జమ్ము, సాంబా, పఠాన్కోట్లపై పాకిస్థాన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ డ్రోన్ దాడిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. జమ్ము కశ్మీర్లోని ఉదంపూర్లో బ్లాకౌట్తో పాటు సైరన్ మోగింది.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి
ప్రజలెవరూ వీధుల్లోకి రావొద్దని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలకు సూచన చేశారు. జమ్ములో కాల్పులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
"జమ్ము, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ నా విజ్ఞప్తి. దయచేసి రాబోయే కొన్ని గంటల పాటు వీధుల్లోకి రావద్దు. మీ ఇళ్లలో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో ఉండండి" అని ఒమర్ అబ్దుల్లా తన సందేశంలో పేర్కొన్నారు. సమాజంలో అనవసర ఆందోళనలు సృష్టించే వదంతులను నమ్మవద్దని, నిర్ధారణ లేని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. మనమంతా కలిసి ఈ పరిస్థితిని అధిగమిద్దామని ఆయన అన్నారు.