Narendra Modi: పాక్‌తో యుద్ధం... గుజరాత్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఫోన్

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమీక్షించారు. పాకిస్థాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్థాన్‌తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్‌లో భద్రతా ఏర్పాట్లపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భద్రతాపరంగా అత్యంత సున్నితమైనవిగా పరిగణించే కచ్, బనస్కంతా, పటాన్, జామ్‌నగర్ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని, పౌరుల భద్రత నిమిత్తం రాష్ట్ర యంత్రాంగం చేపడుతున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.

పాకిస్థాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు.

మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగ్గా ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల మంత్రులు కూడా తమ తమ శాఖల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు, ఆర్థికపరమైన సన్నద్ధత, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవల లభ్యత వంటి పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు.
Narendra Modi
India-Pakistan Tension
Gujarat
Bhupeendra Patel
Border Security
Drone Attacks
Missile Threats
Kutch
Banaskantha
Jamnagar

More Telugu News