పహల్గామ్‌పై అంతకుమించి ఏమీ ఉండదు!: ఐరాస భద్రతా మండలి సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

  • భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలి రహస్య భేటీ
  • సమావేశం ఫలితంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ విశ్లేషణ
  • నిర్దిష్ట తీర్మానాలేవీ ఆమోదం పొందవని అంచనా
  • చైనా, ఇతర దేశాల వైఖరే ఇందుకు కారణమని వెల్లడి
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం నిర్వహించిన క్లోజ్డ్ డోర్ సమావేశం ఎలాంటి నిర్దిష్ట ఫలితాన్ని ఇవ్వబోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఏ పక్షానికీ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ బలమైన తీర్మానాలు వెలువడే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భద్రతా మండలి సభ్యదేశాల మధ్య సంప్రదింపుల అనంతరం వెలువడే ప్రకటన చాలా సాధారణంగా ఉంటుందని శశి థరూర్ పేర్కొన్నారు. "ఒకవేళ పాకిస్థాన్‌ను విమర్శిస్తూ ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెడితే, చైనా తన వీటో అధికారంతో దానిని నిరోధిస్తుంది. అదే సమయంలో, భారత్‌ను తప్పుబడుతూ తీర్మానం వస్తే, అనేక ఇతర దేశాలు దానిని అడ్డుకుంటాయి" అని అన్నారు.

అందువల్ల, "కేవలం శాంతియుత వాతావరణానికి పిలుపునివ్వడం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి పడికట్టు పదాలతో కూడిన సాధారణ ప్రకటన వెలువడుతుందే తప్ప, అంతకు మించి ప్రత్యేకమైన పరిణామాలు ఏవీ ఉండకపోవచ్చు" అని థరూర్ అంచనా వేశారు. ఈ పరిస్థితి విచారకరమైన వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు.

ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం వంటి చర్యలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఐరాస భద్రతా మండలి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదింపజేసుకోవాలని పాకిస్థాన్ తొలుత భావించినప్పటికీ, ఆ దేశ ప్రయత్నాలు సఫలం కాలేదు. పైగా, ఇస్లామాబాద్ ఇటీవల చేసిన బహిరంగ అణు బెదిరింపులు, వరుస క్షిపణి పరీక్షల నిర్వహణపై పలు సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశాలపై పాకిస్థాన్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది.


More Telugu News