వడగాల్పుల వార్తలు అవాస్తవం.. ఐఎండీ స్పష్టీకరణ

  • మే 12 వరకు 45 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రచారం
  • ఉదయం 10 గంటల తర్వాత బయటకు ఎవరూ రావొద్దని హెచ్చరిక
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
  • అది నకిలీదని భారత వాతావరణశాఖ స్పష్టీకరణ
దేశంలో మే 12 వరకు తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు నమోదవుతాయని, ఉదయం 10 గంటల తర్వాత ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ హెచ్చరిక పూర్తిగా అవాస్తవమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తేల్చి చెప్పింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ జారీ చేయలేదని, వైరల్ అవుతున్న పోస్ట్ పూర్తిగా నకిలీదని అధికారికంగా ధ్రువీకరించింది. వాతావరణ సమాచారం కోసం కేవలం తమ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలు, పత్రికా ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

అదే సమయంలో కేరళ, మహె, లక్షద్వీప్‌లకు సంబంధించి మే 1 నుంచి 14 వరకు పొడిగించిన వాతావరణ సూచనను కూడా ఐఎండీ విడుదల చేసింది. దీని ప్రకారం, రెండో వారంలో (మే 8-14) కేరళలోని మధ్య ప్రాంత ఘాట్ ప్రాంతంలో తప్ప, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రెండు వారాల కాలంలో కేరళ, మాహెల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని చోట్ల మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 2025 నెలకు సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాత సరళిపై నెలవారీ అంచనాను విడుదల చేసింది.


More Telugu News