Revanth Reddy: ఫామ్ హౌస్ కే పరిమితమై... ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఫాంహౌస్‌కే పరిమితమై ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదని రేవంత్ విమర్శించారు. "పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తెలంగాణను 'కోతుల గుంపు' చేతికి ఇచ్చినట్లు అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏ పథకాన్ని ఆపలేదని, ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా? అధికారం లేకపోతే బాధ్యతలను గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలుంటే చెప్పాలని, అంతేకానీ నిరాధార విమర్శలు చేయవద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం వచ్చే పదేళ్లూ అధికారంలో ఉంటుందని, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. 
Revanth Reddy
KCR
BRS
Telangana Politics
Assembly
Farmhouse
Kaleshwaram Project
Farmer Loan Waiver
Job Creation
Telangana Assembly Elections

More Telugu News