Akshaya Tritiya: రేపే అక్షయ తృతీయ... బంగారం కొనుగోలుదారులకు శుభవార్త!

- స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
- అక్షయ తృతీయ నాడు డిమాండ్ 15 శాతం వరకు పెరుగుతుందని అంచనా
- గత వారం రికార్డు స్థాయిలో రూ. 1 లక్ష తాకిన పసిడి
అక్షయ తృతీయ పర్వదినం సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలుదారులకు శుభవార్త! బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత వారం రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు, మంగళవారం కొంతమేర తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటాయని, అమ్మకాలు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయ మార్కెట్లో మంగళవారం సాయంత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600కు పైగా తగ్గి రూ. 95,400 వద్ద స్థిరపడింది. అంతకుముందు, ఈక్విటీ మార్కెట్లు ముగిసే సమయానికి (మధ్యాహ్నం 3.30 గంటలకు) బంగారం ధరలో రూ. 691 తగ్గుదల నమోదైంది. గత వారం పసిడి ధర రూ.1 లక్ష మార్కును తాకిన విషయం తెలిసిందే.
అక్షయ తృతీయ ప్రభావం
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకమే అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కోలిన్ షా మాట్లాడుతూ "పండుగకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యత వల్ల ఈ సమయంలో భారతీయులు బంగారం ఎక్కువగా కొంటారు. కొనుగోలుదారుల్లో సానుకూల దృక్పథం కనిపిస్తోంది, దీనివల్ల ఈ సీజన్లో ఆభరణాల విక్రయాలు 10-15 శాతం పెరగొచ్చు" అని అంచనా వేశారు.