పహల్గామ్ దాడిలో పాక్ పాత్ర కన్ఫర్మ్.. ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ సైనికుడే..!

  • హషిమ్‌ మూసాను పాక్ పారా కమాండోగా గుర్తించిన అధికారులు
  • ప్రస్తుతం లష్కరే తోయిబాతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు
  • మరోసారి బయటపడ్డ ఉగ్రవాదులకు, పాక్‌ సైన్యానికి మధ్య సంబంధం
పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం లభించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి దర్యాఫ్తులో భాగంగా అధికారులు కశ్మీర్ లో వందలాదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. హషిమ్ మూసా పాక్‌ పారా కమాండో అని, లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. తమ అదుపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. మూసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్‌ భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్లు గుర్తించామన్నారు.

పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్లు తెలుస్తోందని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్‌ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని తెలిపారు.


More Telugu News

Pakistan Army Pahalgam Attack Hasheem Musa Kashmir Terrorist Attack Lashkar-e-Taiba Pak Para Commando India-Pakistan Conflict Counter-terrorism Terrorism in Kashmir Cross-border Terrorism