Jagdish Devda: విషపూరితమైన వాయువు ఉన్న బావిలో పడిన వ్యాన్... 10 మంది మృతి

10 Dead After Van Falls into Well Filled with Toxic Gas in Madhya Pradesh

  • మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన
  • రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి దూసుకెళ్ళిన వ్యాన్
  • ప్రమాద సమయంలో వ్యాన్ లో 13 మంది

మధ్యప్రదేశ్‌లో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పాడుబడిన బావిలో విషపూరితమైన వాయువు నిండి ఉండడమే వారి మృతికి కారణమని భావిస్తున్నారు. మంద్‌సౌర్ జిల్లాలోని కచారియా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 13 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. కచారియా గ్రామం మీదుగా వెళుతున్న వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వ్యాన్ వేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి సమీపంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సహా ఇతర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్‌దా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద సమయంలో వ్యాన్‌లో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 13 మంది ఉన్నారని ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్‌దా తెలిపారు. నలుగురు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడగలిగారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ స్థానిక యువకుడు కూడా ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు మంద్‌సౌర్ డీఐజీ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య పదికి చేరిందని ఆయన ధృవీకరించారు. వ్యాన్ పడిపోయిన బావిలో విషపూరిత వాయువు ఉందని, ఇది సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని జగదీశ్ దేవ్‌దా పేర్కొన్నారు.

Jagdish Devda
Madhya Pradesh
Mandsaur
Kacharia
Van accident
Toxic gas
Well collapse
NDRF
Tragedy
India
  • Loading...

More Telugu News