Bandar Abbas Port Explosion: ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు

- ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలోని ఓడ రేవులో భారీ పేలుడు
- ఐదుగురు మృతి, 700 మందికిపైగా గాయాలు
- విద్రోహ చర్య, దాడి కాదన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఓడరేవులోని కంటైనర్లలో బాలిస్టిక్ క్షిపణిలకు ఘనరూప ఇంధనంగా వాడే సోడియం పెర్క్లోరేట్ రాకెట్ ప్యూయల్ నిల్వలు
ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ నగరంలోని రజాయే ఓడరేవులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు ధ్వంసం కాగా, ఒక భవనం కుప్పకూలింది.
అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్తో మూడో విడత చర్చలు జరుపుతున్న సమయంలో, ఓడరేవులో శనివారం ఈ భారీ పేలుడు సంభవించడంతో దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు.
బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే సోడియం పెర్క్లోరేట్ రాకెట్ ఇంధనం గత నెలలో షాహీద్ రజాయే ఓడరేవులో దిగుమతి కాగా, చైనా నుండి రెండు నౌకల్లో ఇది వచ్చినట్లు తెలుస్తోంది. బందర్ అబ్బాస్ నగరానికి వెలుపల ఈ పోర్టు ఉండగా, ఇక్కడ పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై అధికార వర్గాలు కొన్ని గంటల వరకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
పేలుడు ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. "పారిపోండి.. పారిపోండి.. గ్యాస్ ట్రక్కును వెళ్లిపొమ్మనండి. అది పేలిపోతుంది. దేవుడా! ఇది పేలిపోతోంది. అందరూ ఖాళీ చేయండి.. పారిపోండి" అంటూ ఒక వ్యక్తి పెద్దగా అరుస్తున్న కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే తెలిపారు.