Padi Kaushik Reddy: క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముచ్చట్లు

నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం నగరానికి వచ్చిన ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో కౌశిక్ రెడ్డి ముచ్చటించారు.
కౌశిక్ రెడ్డి గతంలో హైదరాబాద్ రంజీ ఆటగాడు అని తెలిసిందే. 2004 నుంచి 2007 వరకు దేశవాళీ పోటీల్లో హైదరాబాద్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు.
ఇక, ముంబయి ఇండియన్స్ క్రికెటర్లను పాడి కౌశిక్ రెడ్డి కలిసిన సమయంలో, మాజీ ఆటగాడు చాముండేశ్వరీనాథ్ కూడా అక్కడే ఉన్నారు. కౌశిక్ రెడ్డి కుమార్తె శ్రీనికా రెడ్డికి... సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ తాము ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.