ఒప్పో నుంచి కొత్త ఫోన్... ఆకట్టుకునే స్పెక్స్... అధునాతన ఫీచర్స్!

  • ఒప్పో K13 5G ఫోన్ విడుదల 
  • 7000mAh సామర్థ్యంతో బ్యాటరీ
  • 56 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్
  • ఏప్రిల్ 25 నుంచి అమ్మకాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, భారత మార్కెట్లోకి సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఒప్పో K13 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్, గతేడాది వచ్చిన K12 మోడల్‌కు కొనసాగింపుగా వచ్చింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.

ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ 7000mAh సామర్థ్యం గల బ్యాటరీ. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 30 నిమిషాల్లో 0 నుంచి 62 శాతం వరకు, 56 నిమిషాల్లో పూర్తి (100%) ఛార్జింగ్ అవుతుందని ఒప్పో సంస్థ పేర్కొంది. 

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటు, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మెరుగైన వీక్షణ అనుభూతిని ఈ డిస్‌ప్లే అందిస్తుంది. తడి చేతులతో లేదా గ్లోవ్స్ ధరించి కూడా టచ్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా వెట్ టచ్, గ్లోవ్ మోడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే, వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఏఐ క్లారిటీ ఎన్‌హ్యాన్సర్‌, ఏఐ రిఫ్లెక్షన్‌ రిమూవర్‌, ఏఐ అన్‌బ్లర్‌, ఏఐ ఎరేజర్‌ 2.0 వంటి కృత్రిమ మేధ ఆధారిత కెమెరా ఫీచర్లను కూడా పొందుపరిచినట్లు ఒప్పో వివరించింది. ఐఆర్ రిమోట్ కంట్రోల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 8.45 మిమీ మందం, 208 గ్రాముల బరువుతో రూపొందించబడింది.

ధరల విషయానికొస్తే, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 గానూ, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గానూ ఒప్పో నిర్ణయించింది. పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో ఈ ఫోన్ లభ్యం కానుంది. 

ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లలో దీని విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.


More Telugu News