K Kavitha: కవితను కాపాడేందుకు కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పనిచేస్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్

- బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నారని విమర్శ
- కవిత కోసం కేటీఆర్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్య
- బీఆర్ఎస్ హయాంలో పాలకులు సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేశారని వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి రక్షించడానికి బీజేపీకి బీఆర్ఎస్ ఊడిగం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. కవిత కోసం కేటీఆర్ బీజేపీకి కట్టుబానిసలా పనిచేస్తున్నారని అన్నారు.
సంఖ్యాబలం లేని బీజేపీ... బీఆర్ఎస్ అండ చూసుకొని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నారు. పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్ దొంగల ముఠా, కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనతలను ఆసరా చేసుకున్న బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలకులు సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేశారని, దీంతో నిధులు ఇవ్వకపోయినా బీజేపీని ప్రశ్నించలేకపోయారని ఆరోపించారు. తద్వారా, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అన్నారు. బీజేపీ ప్రవేశ పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ పదేళ్లు మద్దతు ఇచ్చిందని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.